సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్ను ప్రైవేట్పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే. వైఎస్సార్సీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి..
ఆంధ్రా మత్స్యకారులు పాక్, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు.
మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్జగన్ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు.


