సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫ్యూచర్ సిటీ విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటరిచ్చారు. హరీష్ రావుకు తన ఫ్యూచరే తెలియదు.. ఫ్యూచర్ సిటీని ఆపుతారా? అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..‘ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఒప్పందాలున్నాయా?. పదేళ్లలో ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందంటే అసూయ కలగక మానదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్లు కట్టుకున్నారు. కాంగ్రెస్.. రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారు.
మూసీ ప్రాజెక్ట్కు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోంది. మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్ర చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న హరీష్ రావు.. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. హరీష్.. మీ పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా కుట్రలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో. బీఆర్ఎస్కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


