సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు.


