
సాక్షి, ఉప్పల్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ను మడతపెట్టి కొట్టుడే అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కూడా మంచికే జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, కేటీఆర్ ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఉప్పల్లో జోష్ చూస్తుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉందా? అనే ఫీలింగ్ వస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాల్కాజ్గిరిలో గెలుపు మనదే. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్ అని, చేతల ప్రభుత్వం కాదని తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రేవంత్లాగా మేము కూడా తిట్టగలం. కానీ, మాకు సభ్యత ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నాను. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తోంది. ఇలా అయినా కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు తెలుస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.