Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..! | KSR Comment On Nara Lokesh Red Book | Sakshi
Sakshi News home page

Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!

Mar 31 2025 10:39 AM | Updated on Mar 31 2025 1:26 PM

KSR Comment On Nara Lokesh Red Book

తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన  పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 

అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్‌(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన  కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 

👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్‌టీఆర్‌, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు  ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి  రామారావునే  కూలదోసిన సంగతీ తెలిసిందే. 

👉చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు.  ఎన్టీఆర్‌ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ  వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది.  ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన  వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు  విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. 

వార్షికోత్సవంలో ఒకరినొకరు  పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్‌ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. 

  • ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే,  చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! 

  • తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్‌ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. 

  • ఎన్టీఆర్‌ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు  ఆయనను పదవీచ్యుతుడిని చేసి  మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా  కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా  చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 

  • 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 

👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్  అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు  పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష  రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు  చేస్తే  తాట తీస్తామని చెబుతారు. 

చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్  ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే  కాదు.. ఆయన పనులు కూడా అలాగే  ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. 

రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు  పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే  ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని..  అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు  ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని,  అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే  దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్‌సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. 

.. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర  హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి  అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే  నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే  చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement