
పార్టీ బలోపేతంపై ఫోకస్.. త్వరలో పార్టీ విస్తృత సమావేశం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మాజీ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం..విమర్శలకు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలపై తొందరపడి స్పందించొద్దని మాజీ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించారు. జూన్ 1న అమెరికాలోని డల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈనెల 28న హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్తో కేటీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గత నెల 27న ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ, అనంతరం జాతీయంగా, రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, వాటిపై బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం, విమర్శలపై కేసీఆర్తో చర్చించారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచి్చన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని కేటీఆర్ను ఆదేశించారు.
డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్నకు సంబంధించిన వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు డల్లాస్ సభలో ప్రసంగిచాల్సిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగింది. తెలంగాణవాసులతో సభ అనంతరం జరపాల్సిన భేటీలపై ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతను మండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారికి అప్పగించాలని నిర్ణయించారు.