
సాక్షి, హైదరాబాద్: సోదరి, పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి పెదవి విప్పారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్రావు, సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు.
తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కవిత ఆరోపణలపై ప్రశ్న ఎదురైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించిన తర్వాతనే అధినేత నిర్ణయం తీసుకున్నారని, ఇంక ఆమెపై స్పందించడానికి ఏం లేదు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన.
తాజాగా కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తనను అక్రమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తానెప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. తనపైపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనిది తెలంగాణ భవన్లో మహిళా నేతలు స్పందించడమే తనకు కొంత ఊరట కలిగించిందని వ్యంగ్యంగా మాట్లాడారామె.
