సీఎం రమేష్‌ సారా అక్రమాల చరిత్ర ఇది | History Of C M Ramesh Liquor Irregularities, More Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం రమేష్‌ సారా అక్రమాల  చరిత్ర ఇది

Published Fri, Apr 5 2024 4:10 PM

History Of Cm Ramesh Liquor Irregularities - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి  సీఎం రమేశ్‌ అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు..  సీఎం రమేష్‌పై తాజాగా పోలీస్‌ కేసు నమోదైంది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్‌ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించిన  సీఎం రమేష్‌ అక్రమాల చరిత్రను పరిశీలిస్తే..

కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్‌ తన తండ్రితో పాటు సారా వ్యాపారం చేశారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్‌ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మరొక కేసులో సీఎం రమేష్‌ తండ్రిని పీడీ యాక్ట్‌ కింద అరెస్టు అయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లను ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్‌కు బాగా తెలుసు. 1989–94లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయట పడడానికి సీఎం రమేష్‌ ఆయన కుటుంబం  కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకునే వారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాక సీఎం రమేష్‌ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. 

కుప్పంలో ఓటు మేనేజ్‌మెంట్‌ అంతా సీఎం రమేష్‌ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్లు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్‌కు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్‌ రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్‌ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్‌టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుంది.? కోల్‌కత్తాలో ఈడీ అధికారులపై అక్కడి టీఎంసీ నేతలు దాడికి దిగితే ఖండించిన బీజేపీ ఇప్పుడు సీఎం రమేష్‌ చేసిన ఈ దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతుంది?

అక్రమ సారా నుంచి రూ.3 వేల కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్‌ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాడు. పోట్లదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లికి తీసుకొచ్చాడు. నీతులు చెబుతున్న చంద్రబాబు... సీఎం రమేష్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంటో చెప్పగలరా?. గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికే చెందిన రమేష్‌ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతారు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement