తొలిసారి ఎమ్మెల్యేలు వీరే..! | First Time Winners In Telangana Assembly Elections | Sakshi
Sakshi News home page

Telangana Election Results : ఫస్ట్‌ టైమ్‌ అధ్యక్షా అనే ఛాన్స్‌ !

Dec 3 2023 2:14 PM | Updated on Dec 3 2023 4:22 PM

First Time Winners In Telangana Assembly Elections - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ ఎన్నికల్లోనే తొలిసారి పోటీచేసిన వాళ్లలో కొందరిని ప్రజలు దీవించారు. వీరిలో అతి చిన్న వయసు వాళ్లు కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ఫస్ట్ టైమ్‌ ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో పాలకుర్తిలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన యశస్వినిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై  8 వేల ఓట్ల మెజారిటీతో  గెలుపొందారు.

మెదక్‌ నుంచి పోటీచేసిన మైనంపల్లి రోహిత్‌రావు ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు. వేములవాడలో కాంగ్రెస్‌  నుంచి పోటీచేసిన ఆదిశ్రీనివాస్‌  విజయం సాధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాగూర్‌ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ నుంచి కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యేగా గెలవగా ఇదే జిల్లా నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కలకుంట్ల మదన్‌మోహన్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నుంచి ముందుల శామ్యూల్‌ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అందుకున్నారు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల అయిలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా ఫస్ట్‌టైమ్‌ అధ్యక్షా అనే ఛాన్స్‌ వచ్చింది. 


Advertisement
 
Advertisement
Advertisement