
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్కు ఉందా? అని సవాల్ విసిరారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. మూడు లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వలంటీర్లు, నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మ ఒడి ఇవ్వకుండా తల్లులు, పిల్లలను ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్స్ చేశారు. సూపర్ సిక్స్ ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వటం చేతకాకపోతే పదవిలో నుండి దిగిపోవాలి
లక్షా 52 వేల కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు. చెత్త సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రూ.15లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైఎస్ జగన్పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేశారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్దాలు మాట్లాడి, ఎల్లో మీడియాతో అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారు.
ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు. కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోలు బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా?. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడపడితే అక్కడ గంజాయి సాగు జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్టుషాపులు ఉన్నాయి
రాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆస్పత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ పుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు?. యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవీ?. సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరు ఎక్కించారు?. ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకున్నాడు.

త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు. మొన్నటి జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్కు నిజమైన సైనికులుగా నిలబడి మావారు పని చేశారు. రెడ్ బుక్కు భయపడలేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా తయారు అయ్యారు. రూల్స్కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యావసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం. పీ-4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందే తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం, గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడు?. తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పాశ్చాత్య పడలేదు?. రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించటం లేదు?. వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు?.
వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్సార్సీపీలోని స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్టు చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.