సాక్షి, ప్రకాశం: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో కంకర లోడుతో వస్తున్న టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. చీమకుర్తి నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్ పలకల క్వారీల మలుపు వద్ద ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు క్యాబిన్లో గుర్తు పట్టలేని విధంగా నాలుగు మృతదేహాలు ఉన్నాయి. బస్సు ప్రమాదం సమయం 40మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం ఉదయం 6-6.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణ
ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రమాదంతో బస్సు అద్దాలు పగలగొట్టి కొందరు ప్రయాణికులు కిందకి దూకారు. స్లీపర్ బస్సు కావడంతో బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తులపై ఉన్నవాళ్లేనని తేలింది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా బస్సులోనే మృత దేహాలు : డీఎస్పీ
బస్సు ప్రమాదంపై మార్కాపురం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇంకా బస్సులోనే మృత దేహాలున్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయపడ్డవారికి మార్కాపురం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

నిన్న సాయంత్రం 6గంటలకు నిర్మల్ నుంచి బస్సు బయల్దేరింది. నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కనిగిరి పామూరు వాసులుగా గుర్తించారు.




