ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం: జైరాం రమేష్‌ | Congress Distances Itself From Sam Pitrodas China Remark | Sakshi
Sakshi News home page

ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం: జైరాం రమేష్‌

Feb 17 2025 6:39 PM | Updated on Feb 17 2025 7:06 PM

Congress Distances Itself From Sam Pitrodas China Remark

న్యూఢిల్లీ:  భారత్ కు చైనా శత్రువు కాదంటూ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా(sam pitroda) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమకేమీ సంబంధం లేదని అంటోంది   ఈ వ్యవహారంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జి జై రాం రమేష్(Jairam Ramesh స్పందించారు. అది శామ్ పిట్రోడో వ్యక్తిగత అభిప్రాయమని, దానితో పార్టీకి సంబంధం లేదన్నారు. శామ్ పిట్రోడో చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపదని జై రాం రమేష్ క్లారిటీ ఇచ్చారు.

చైనా(China)పై శామ్ పిట్రోడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ అభిప్రాయాలు కావన్నారు. చైనా అతిపెద్ద విదేశాంగ,  భద్రత విధానంతో పాటు మనకు ఆర్థిక సవాలుగా మిగిలిపోయింది అని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు జై రాం రమేష్‌

కాగా,  పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడో.. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.

భారత్‌ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్‌ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్‌ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో  తనకు అర్థం కావడం లేదన్నారు.

చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్‌ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.

గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్‌ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్‌,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్‌ అవుతున్నారు.  దాంతో కాంగ్రెస్ దిగివచ్చింది. తమ పార్టీకి శామ్ పిట్రోడో వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదంటూ జై రాం రమేష్ వ్యాఖ్యానించడం అందుకు ఉదాహరణ.

Advertisement
 
Advertisement
Advertisement