సామాజిక న్యాయంతో కేబినెట్‌ కూర్పు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy in a chat with media | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయంతో కేబినెట్‌ కూర్పు: సీఎం రేవంత్‌

Jun 12 2025 4:01 AM | Updated on Jun 12 2025 4:01 AM

CM Revanth Reddy in a chat with media

ఢిల్లీలో కేవలం కర్ణాటకలో కులగణనపై మాత్రమే చర్చించాం 

డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ లేకుండా శాఖలపై చర్చ ఎలా ఉంటుంది?

మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

తెలంగాణ అభివృద్ధికి కేంద్రమంత్రి 

కిషన్‌రెడ్డే ప్రధాన అడ్డంకి అన్న సీఎం 

తాను ఉన్నంతకాలం కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ కుటుంబాన్ని రానివ్వనని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. 

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్‌ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్‌ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్‌ అవకాశం ఇచ్చాం. 

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు 
సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం.  

ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు 
పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్‌లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం.  

‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. 
కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే వంద శాతం అడ్డంకి. 

తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్‌లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్‌ చెన్నైకి, ప్రల్హాద్‌ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్‌ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్‌రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్‌ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ.  

కేసీఆర్‌ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు 
కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్‌ఎస్‌ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్‌ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్‌ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్‌ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్‌ మాట్లాడలేదు. 

అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు 
నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement