51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్‌ వ్యూహమేంటి? | Cm Kcr Handed Over B Forms To 51 Mla Candidates | Sakshi
Sakshi News home page

51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్‌ వ్యూహమేంటి?

Oct 15 2023 4:08 PM | Updated on Oct 15 2023 4:31 PM

Cm Kcr Handed Over B Forms To 51 Mla Candidates - Sakshi

 మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్‌లు అందజేసి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు.

‘‘మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని కేసీఆర్‌ సూచించారు. 

అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఎన్నికల కో ఆర్డినేటర్‌ భరత్‌ కుమార్‌కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. బీఫామ్‌ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్‌ ఇస్తాం. ఈ రోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్‌ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. అన్ని బీ ఫామ్స్‌ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్‌ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరో వైపు, 51 మంది అభ్యర్థులకే బీఫామ్స్ అందజేయటంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అన్ని బీ ఫామ్స్‌ ఇంకా రెడీ కాలేదని, మిగతా వారికి బీఫామ్స్‌ రెడీ అవుతున్నాయని కేసీఆర్‌ చెప్పినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు నెలల క్రితమే 115 మందితో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌ ప్రకటించారు. ఇవాళ అన్ని స్థానాలకు బీఫామ్‌లు ఇస్తారని అంతా భావించారు.. కానీ 51 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరికిపై తీవ్ర వ్యతిరేకత ఉందని..  అందుకే బీఫామ్‌లు ఇవ్వలేదని, ఆ స్థానాలను మార్చనున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. దీంతో వారిలో టెన్షన్ నెలకొనగా.. వారు ఎవరనేది ఇప్పడు హాట్‌ టాపిక్‌గా మారింది
చదవండి:​ బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. కేసీఆర్‌ హామీలివే..!

Advertisement
 
Advertisement
Advertisement