హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా? | Capital Amaravati: Kommineni Comments On Chandrababu Real Estate | Sakshi
Sakshi News home page

హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?

Apr 30 2025 11:49 AM | Updated on Apr 30 2025 11:53 AM

Capital Amaravati: Kommineni Comments On Chandrababu Real Estate

పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.

ఈ నిర్ణయానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. 

అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో  శాంతిభద్రతల సమస్యపై  తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!

విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్‌ భారీగా పడిపోతుంది.

అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు  తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.

చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.

మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.

మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? 

గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను  ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.

సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.

ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్‌ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా  తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement