
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలో మాజీప్రధాని రాజీవ్గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచి్చన తర్వాత ఆ విగ్రహాన్ని మరోచోటకు తరలిస్తామన్నారు. నందినగర్ నివాసంలో కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేర్ల మార్పుపై ఏనాడూ ఆలోచించలేదు.
ఆరోగ్యశ్రీ పథకం, ట్రిపుల్ ఐటీ, ఉప్పల్ స్టేడియం, కరీంనగర్– మంచిర్యాల రాష్ట్ర రహదారి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితరాలకు రాజీవ్గాంధీ పేరు ఉన్నా మా ప్రభుత్వం ఏనాడూ మార్చే ప్రయత్నం చేయలేదు. రాహుల్గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటే గాం«దీభవన్లోనో, రేవంత్రెడ్డి ఇంట్లోనో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. రాష్ట్ర సాధన ఉద్యమమే ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగింది.
కానీ వందలాదిమంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ మాత్రం మరోమారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణతల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ విగ్రహాన్ని పెడుతోంది. తెలంగాణతల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదు. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.
ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న రాజీవ్గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి కాంగ్రెస్ పార్టీ కోరుకున్న చోటుకు పంపిస్తాం. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతాం. రాజీవ్గాంధీ పేరిట ఉన్న సంస్థల పేర్లను కూడా మార్చే దిశగా ఆలోచిస్తామని ఢిల్లీకి గులాములుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు చెబుతున్నా’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి
‘తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సచివాలయం ఎదురుగా ప్రతిíÙ్ఠంచాలనే ఉద్దేశంతో ఒక ఐలాండ్ కూడా నిర్మించాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని పెడుతోంది. జై తెలంగాణ అనని సీఎం రేవంత్ కనీసం అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. దివంగత మాజీ సీఎం అంజయ్య పేరిట ఏర్పాటు చేసిన పార్కును లుంబినీగా మార్చి, అదే పార్కు ఎదుట ఆయన్ను అవమానించిన రాజీవ్గాంధీ విగ్రహం పెడుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు.
పదేళ్ళ పాలన ఓ యజ్ఞంలా సాగించాం
– కేటీఆర్తో శ్రీలంక వాణిజ్యమంత్రి భేటీ
రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలనను ఓ యజ్ఞంలా సాగించి అసాధారణ ఫలితాలు సాధించామని కేటీఆర్ అన్నారు. శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కేటీఆర్తో నందినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు స్ఫూర్తిదాయకమని సతాశివన్ అన్నారు.
హైదరాబాద్ వంటి ఆర్థిక ఇంజిన్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. పదేళ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని సతాశివన్ కేటీఆర్కు వెల్లడించారు. ఈ భేటీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేతలు జాజాల సురేందర్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
రాఖీ రోజు నా సోదరి వెంట లేదు
– ‘ఎక్స్’లో కేటీఆర్ భావోద్వేగం
‘ఈ రోజు నాకు రక్షా బంధనం చేయలేకపోవచ్చు. కానీ నీ కష్టసుఖాల్లో వెంట ఉంటా’అని కేటీఆర్ తన సోదరి కవితను ఉద్దేశించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. గతంలో తన సోదరి రాఖీ కట్టిన ఫొటోలను సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘155 రోజులుగా కవిత ఎంతో వేదన అనుభవిస్తోంది. సుప్రీంకోర్టులో ఆమెకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కాగా రాఖీ పండగ సందర్భంగా తెలంగాణభవన్లో జరిగిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
కాగా బీఆర్ఎస్ పదేళ్లపాలనలో తెలంగాణలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల వివరాలు ఇస్తామని మంత్రి సీతక్క చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. ‘ఎనిమిది నెలల్లో కొల్లాపూర్, షాద్నగర్ సహా అనేక చోట్ల మహిళల పట్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోందో తెలుసు. కోల్కతాలో యువ వైద్యురాలిపై అఘాయిత్యం చేసి చంపేస్తే, నిరసన తెలుపుతున్న డాక్టర్లు తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు. దటీజ్ తెలంగాణ.. దటీజ్ కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయింది’అని కేటీఆర్ అన్నారు.