రేవంత్‌, కేటీఆర్‌.. ధర్నా చేసే దమ్ముందా?: బీజేపీ ఎంపీ రఘునందన్‌ | BJP MP Raghunandan Rao Challenge To KTR And Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌, కేటీఆర్‌.. ధర్నా చేసే దమ్ముందా?: బీజేపీ ఎంపీ రఘునందన్‌

Jul 26 2024 10:55 AM | Updated on Jul 26 2024 10:59 AM

BJP MP Raghunandan Rao Challenge To KTR And Revanth Reddy

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు. రెండు పార్టీలు బడ్జెట్‌ కేటాయింపులపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. రేవంత్‌, కేటీఆర్‌ ఇద్దరూ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయాలి అంటూ ఘాలు వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఢిల్లీలో రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. ​కేంద్ర బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయి. గత పదేళ్లుగా ఎన్డీయే నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైఖరి ఒకటే ఏం మారలేదు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం నాగేందర్‌ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారు.

ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామన్నారు. ఏడాదికి రూ.30వేలు అవుతుంది.. ఇది ఇచ్చారా? బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి?. వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి మరి?. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.9లక్షలపైనే ఉంది. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.1 లక్షపైన ఉంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.26వేల కోట్లుగా చూపించారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.21వేల కోట్లపైన చూపించారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారు.

రేవంత్ రెడ్డి, కేటీఆర్ జంతర్ మంతర్ల ధర్నా చేయాలి. నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా లేదా?. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షలకు కేంద్రం పెంచింది. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారు. మైనారిటీల పండుగల కోసం రూ.33 కోట్లు కేటాయించారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా?. సెక్యులరిజం అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement