రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ?! | Ap Bjp Split Into Two | Sakshi
Sakshi News home page

రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ?!

Mar 26 2024 2:06 PM | Updated on Mar 26 2024 3:17 PM

Ap Bjp Split Into Two - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందా?. కీలక సమావేశానికి సీనియర్‌ నేతలు డుమ్మా కొట్టడంతో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మంగళవారం నగరంలో ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశానికి ‘ఆ నలుగురు’ రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.

బీజేపీ ఇప్పుడు.. టీడీపీ బీజేపీ, ఒరిజినల్‌ బీజేపీ వర్గాలుగా విడిపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, ఏపీ ఎన్నికల ఇన్‌చార్జి అరుణసింగ్‌ సైతం హాజరయ్యారు. అలాంటి సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్‌, విష్ణువర్థన్‌రెడ్డి, సత్యకుమార్‌లు గైర్హాజరు అయ్యారు. ఈ నలుగురు టికెట్లు ఆశించి భంగపడ్డ సంగతి తెలిసిందే. 

ఇక.. కూటమి పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాలు తీసుకుని.. అందులో ఐదింటిని వలస నేతలకే  ఇచ్చింది. ఈ పరిణామాలపై ఏపీ సిసలైన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ తాజా ఎంపీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు అనుచరులకే సీట్లు దక్కాయి. అసెంబ్లీ సీట్లలోనూ 80 శాతం సొంత సామాజికవర్గానికే సీట్లు దక్కించుకోబోతున్నారని తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే వాళ్లు సమావేశానికి రాలేదన్న టాక్‌ బలంగా వినినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సోమువీర్రాజు అనారోగ్యంతోనే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, రాజమండ్రి ఎంపీ టికెట్‌ ఆశించిన ఆయన.. ఆ టికెట్‌ పురందేశ్వరికి వెళ్లిపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి సత్యకుమార్‌, అనపర్తి నుంచి సోమువీర్రాజులు పోటీ చేయాలనే ప్రతిపాదనను ఏపీ బీజేపీ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే సోమువీర్రాజు అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలక సమావేశానికి ముఖ్యనేతల గైర్హాజరుపై బీజేపీ నేతల్లో చర్చ నడుస్తోంది. 

పురంధేశ్వరి కామెంట్స్‌
మూడు పార్టీల పొత్తు చార్రితక అవసరం. పొత్తులతో చాలామంది ఆశావహులకు నిరాశ కలిగింది. రాష్ట్రంలో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు అయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement