నారా లోకేష్‌ను దాచేసినట్లున్నారు: మంత్రి అంబటి | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌ను దాచేసినట్లున్నారు: మంత్రి అంబటి

Published Mon, Feb 5 2024 4:50 PM

Ambati Rambabu Slams MP Balasouri Over Switch To Janasena - Sakshi

ఇచ్చిన హామీలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేపోయింది అనే ఓ అసత్యాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. కానీ, దేశంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీనే. ఇది రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలుసు అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు.  సోమవారం అసెంబ్లీ పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

‘‘2014-19 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది బాబు-జగన్ మధ్య ఉన్న తేడా. ఈ ఎన్నికలకు మా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది. వెబ్ సైట్ లో లేదు. మేనిఫెస్టోలను మాయం చేసిన తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు.. మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్ళి ఇచ్చిన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు జగన్. 

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు  సీఎం జగన్ గారు. అందుకే మరల తిరిగి ఓటు అడగడానికి వెళ్తున్నాం, సిద్దమయ్యాం.. మా టార్గెట్ 175.  175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాం.  మేము మేనిఫెస్టో అమలు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోను తీసుకొచ్చి మాట్లాడాలి.. మా మేనిఫెస్టోని పట్టుకుని మాట్లాడే దమ్ము, ధైర్యం మాకు ఉంది.

సీట్లు, నోట్ల ముష్టి కోసం వెళ్ళాడా?
చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ ఉదయం, సాయంత్రం వెళ్లి వచ్చాడంటా! ప్యాకేజీ ముష్ఠి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్ఠి కోసం వెళ్లాడా?. జనసేన నాయకులు, కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా... కుక్క తోక పట్టుకుని గోదారి ఈదకండి. చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్ కార్యకర్తల్ని ముంచుతాడు. చంద్రబాబు మీకు ముష్ఠి వేస్తాడు, ఆ ముష్ఠి తీసుకునే పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకు ఉంది. రోజు తిరగడమే పని తప్ప ఫలితం ఉండదు. చంద్రబాబు 20-25 సీట్లు ఇవ్వడమే గగనం. ఇది అందరికి తెలిసిన సత్యం. జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలి, మీరు మోసపోతున్నారు.

జన విజయం తథ్యం
సక్సెస్ ఫుల్ సీఎంగా జగన్ గారు రాష్ట్ర చరిత్రలో నిలబడపోతున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండో సారి ఏ విధంగా  నిలబడ్డాడో, ఆ విధంగా మళ్ళీ  గెలిచి సీఎంగా జగన్ గారు రికార్డ్ సృష్టించబోతున్నారు. ఎన్ని పద్మవ్యూహాలు పన్నినా ఎందరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు చేసినా, చరిత్రలో నిలబడే విజయాన్ని జగన్ గారు సాధించబోతున్నారు. జగన్ గారు సుపరిపాలన చూసి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఎవరూ కదలడం లేదు
టీడీపీ-జనసేన ఏదేదో మాట్లాడతారు.. అసలు వారు ఇంతవరకు సిద్దమే కాలేదు,ఇంకా భేటీలలోనే ఉన్నారు. మేము సిద్దం అయ్యాము, దూసుకుపోతున్నాం. వాళ్లు సీట్లు, నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు. కనపడినవాళ్ళందరినీ.. రా కదలిరా అంటున్నారు  కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు.. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. సినిమా యాక్టర్ ను చూడడానికి వచ్చిన వాళ్ళందరికి చంద్రబాబు ఉపన్యాసం చెబుతారంటా. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తీసుకువెళ్ళినట్టు..  పవన్ కల్యాణ్ ను తీసుకెళ్ళి జనాల్ని పోగేసేకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 

లోకేష్ బయటకు వచ్చినా.. రాకపోయినా.. 
చిత్రంగా లోకేష్ ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు, దాచేసినట్టున్నారు.. ఆయన్ను బయటకు పంపిస్తే టీడీపీ ఔట్ అని చెప్పినట్టున్నారు. లోకేష్ ను దాచేసినా, బయట పెట్టినా టీడీపీ ఔటే.. ఇది వాస్తవం.. పాదయాత్ర చేసిన వీరుడు, సూరుడు అని చెప్పిన లోకేష్ ను తీసుకెళ్ళి పక్కనపెట్టారు .. మీరు పొత్తులు పెట్టుకున్నా, కూటమి కట్టినా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పక్కనపెట్టబోతున్నారు.

బాలశౌరి ఒక బఫూన్.. త్వరలో అది తెలుస్తుంది
మా పార్టీలో టికెట్ లేని బఫూన్ లు వేరే పార్టీలో చేరతారు, ఇక్కడ టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశౌరి వెళ్లి అక్కడ చేరాడు, కొద్దిగా ఓవర్ గా మాట్లాడాడు.. ఓవరాక్షన్ చేస్తేనే తప్ప అక్కడ గుర్తించమన్నట్టున్నారు. చాలా ప్రగల్భాలు పలికాడు.. చాలా ఓవరాక్షన్ చేశాడు. పవన్ కల్యాణ్ బాలశౌరిని ఉద్దేశించి.. ‘ఇప్పటి వరకు అక్కడుండి ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు, వీడిని నమ్మొచ్చా?’ అన్నాడు..

బాలశౌరి జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 2004 నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, తెనాలి పార్లమెంట్ లో పోటీ చేసిన దగ్గర నుంచి బాలశౌరి గురించి తెలుసు. బాలశౌరి పుట్టుక దగ్గర నుంచి నేటి వరకు అన్నీ తెలుసు. ఇక్కడ తంతే వెళ్ళి జనసేన ఆఫీస్ లో పడ్డాడు. అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేస్తే జనసేన ఆఫీసులో తేలాడు. .. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ను దూషించే కార్యక్రమం చేస్తున్నాడు. బాలశౌరిని నమ్మోచ్చా? అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అనుకున్నారంటా? బాలశౌరిని ఎవరూ నమ్మరు.. ఎవరినైనా ముంచిపోయే తత్వమే బాలశౌరిది. గత్యంతరం లేక బందరు టికెట్ ఇవ్వొచ్చు ఏమో!. బాలశౌరిది ముంచిపోయే తత్వమని మనకన్నా నాదెండ్ల మనోహర్ కి, పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు, రాబోయే కాలంలో మీరే చూస్తారు.

ఏపీ ప్రజలది కృష్ణావతారం.. తనది అర్జునుడు పాత్ర అని సిద్ధం సభల్లో వైఎస్‌ జగన్‌ చెప్పగానే వాళ్ళకి ఎంతగా గుచ్చుకుందో?. దుష్టచతుష్టయం పద్మవ్యూహాలను, పన్నే పన్నాగాలను ఛేదించుకుని రాగలిగే వీరుడు.. అర్జునుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి అంబటి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement