ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు.. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి అధిక సంఖ్యలో అర్జీదారులు వస్తున్నారు. ఇందులో స్వల్ప వినతులకే పరిష్కారం లభిస్తోంది. పింఛన్ల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం.. కొత్తవి మంజూరు కాకపోవడంతో అన్ని అర్హతలూ ఉన్న లబ్ధిదారులు వందలాది మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న.. మంచానికే పరిమితం అయిన వారు సైతం మరొకరి సాయంతో వచ్చి, న్యాయం కోసం ఆరాట పడుతున్నారు. సోమవారం కలెక్టరేట్కు వచ్చిన కొంతమంది పింఛన్ బాధితుల ఆవేదనకు అక్షర రూపం. – సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్
మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన తేలు రఘు, సంతోషి కుమారి దంపతుల కుమారుడు మోక్షిత్.. పుట్టుకతోనే వంద శాతం మానసిక, శారీరక దివ్యాంగుడు. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న మోక్షిత్కు.. వైద్యాధికారులు సదరం ధ్రువపత్రం కూడా జారీ చేశారు. అన్ని అర్హతలూ ఉన్నా నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. తమ బిడ్డ
అవస్థను చూపిస్తూ, ఆ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ రెండేళ్లుగా
తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంతో వీరు లబ్ధి పొందలేకపోతున్నారు.. ఆ చిన్నారికి న్యాయం జరగడం లేదు.
ఈ చిత్రంలోని యువకుని పేరు వండన సురేంద్ర. వంద శాతం దివ్యాంగత్వంతో బాధ పడుతున్నాడు. కూర్చోలేడు.. తోడు లేకుండా స్వతహాగా నిల్చోలేడు. ప్రస్తుతం రూ.6 వేలు పింఛన్ వస్తోంది. అతని పరిస్థితి అర్థం చేసుకుని, ఆ మొత్తం పెంచాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


