జీఎంఆర్‌లో ఫీజుల పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

జీఎంఆర్‌లో ఫీజుల పంచాయితీ

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

రాజాం: రాజాంలోని జీఎంఆర్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఫీజుల ‘పంచాయితీ’ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పరీక్షల వేళ కలవరపెడుతోంది. గత ఏడాదికాలంగా చంద్రబాబు ప్రభుత్వం ఐటీ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదలచేయలేదు. ఫీజులు చెల్లించకపోవడంతో జీఎంఆర్‌ ఐటీలో చదువుతున్న విద్యార్థుల ఇయర్‌ ఎండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు హాల్‌ టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చా రు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్‌ పే ద్వారా డబ్బులు చెల్లించి హాల్‌ టిక్కెట్లు తీసుకోగా, మరికొంతమంది తమకు తెలిసిన పెద్దలతో గడువుతీసుకుని యాజమాన్యాన్ని ఒప్పించారు. ఇంకొంతమంది కళాశాల వద్ద సోమ వారం నిరసన తెలిపారు. రోడ్డెక్కేందుకు సిద్ధంకాగా, కళాశాల ప్రొపెషర్లు కలుగుచేసుకుని రెండురోజులు గడువు ఇచ్చి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమనిగించారు.

విద్యార్థులకు తప్పని తిప్పలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమచేసేది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. ప్రస్తుత చంద్రబాబు ప్రభు త్వం కళాశాలల ఖాతాల్లోకి ఫీజులు చెల్లించే జీఓ తెచ్చినా సకాలంలో జమచేయడం లేదు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులు వద్ద ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఫీజులు చెల్లించనివారికి హాల్‌టికెట్లు ఇవ్వడంలేదు. ఆందోళనకు దిగితే ప్రాక్టికల్స్‌ మార్కులు తగ్గిస్తామంటూ బెదిరిస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. జీఎంఆర్‌ఐటీలో ఒక ఏడాదికి 4500 మంది విద్యార్థులు చదువుతుండగా, జీసీఎస్‌ఆర్‌ కళాశాలలో మరో 1500మంది చదువుతున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ నిధులు విడుదల చేయకపోవడం చదువులకు శాపంగా మారింది.

చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం దారుణం. ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాజాం జీఎంఆర్‌ఐటీలో చదువుతున్న ఐటీ విద్యార్థులకు ఇయర్‌ ఎండింగ్‌ సెమిస్టర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం నానారభస చేసింది. బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోంది. అటు ప్రభుత్వం రాయితీ ఫీజులు ఇవ్వకపోగా, కళాశాలల మొండివైఖరిని పట్టించుకోకపోవడం శోచనీయం. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు ప్రభుత్వం విడుదలచేయాలి. లేకుంటే పోరాటం చేస్తాం. – పి.రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, రాజాం

విడుదలకాని ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు

ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై వర్సిటీ అధికారుల ఒత్తిడి

హాల్‌టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ

ఆందోళనకు దిగిన విద్యార్థులు,

వారి తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement