పార్వతీపురం రూరల్: వివిధ వస్తువుల కొనుగోలు, సేవలు పొందడంలో మోసపోయిన వారికి న్యాయం చేసేందుకు రాష్ట్రంలోనే తొలగిసారిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో ‘వినియోగదారుని క్లినిక్’ను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం ప్రారంభించారు. నకిలీ వస్తువులు, నాణ్యత లేని సేవలు, అధిక ధరలతో నష్టపోయే సామాన్య వినియోగదారులకు ఈ క్లినిక్ న్యాయం అందిస్తుంది. ఉచిత న్యాయ సేవలతో పాటు బాధితుల తరఫున వినియోగదారుల ఫోరమ్లో పోరాడేందుకు ఈ క్లినిక్ సహకరిస్తుంది. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. డీసీఐసీ ఇన్చార్జి పి.నాగమణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. మోసాల్లేని వ్యాపారానికి, పారదర్శక సేవలకు ఈ క్లినిక్ వేదిక కావాలని ఆకాంక్షించారు.


