న్యూస్రీల్
ఎన్నికల హామీలను అటకెక్కించిన టీడీపీ సర్కారు
● సూపర్ సిక్స్ హామీల్లో
ఒక్కటీ సరిగా అమలు చేయని వైనం
● కంటితుడుపు చర్యలుగా పలు పథకాలు
● ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి
ఊసే ఎత్తని వైనం
● అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా
పైసా విదల్చని ప్రభుత్వం
● ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రశ్నించేందుకు
సిద్ధమవుతున్న మహిళా లోకం
దాచేపల్లి: అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చిన కూటమి పార్టీల నేతలు వాటి అమలుపై మాత్రం మౌనం దాల్చుతున్నారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు వాటిని అమలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్.. అంటూ టీడీపీ సర్కార్ చెబుతున్న మాటలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా సూపర్ సిక్స్లో కీలకమైన రెండు ప్రధాన హామీల జోలికి వెళ్లకపోవడంపై అన్నివర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యువతకు 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగాలు కల్పించే వరకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీతో పాటు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఉత్తుత్తి ప్రచారాలు చేసుకుంటుందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
మహిళలకు మొండిచేయి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,500 చొప్పున ఆర్థిక భరోసా అందించింది. ఈ పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది. దీంతో 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తామని మాయ మాటలు చెప్పారు. అయితే టీడీపీ సర్కార్ ఏర్పడి రెండేళ్లు దాటినా ఇప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. టీడీపీ ప్రభుత్వం చెప్పిన నెలకు రూ.1500 హామీ గురించి మహిళలు ప్రతిచోట మాట్లాడుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కన్పిస్తొంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేసిన పథకం తీరును గుర్తు చేసుకుంటున్నారు. కళాశాలలకు వెళ్లే విద్యార్థుల నుంచి వివిధ పనులకు వెళ్లే మహిళలు సైతం రూ.1500 పథకం గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఓ మంత్రి మాట్లాడుతూ ఆ పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో కూటమి సర్కార్ పథకం అమలు చేస్తుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.
‘స్థానిక’ ఎన్నికల్లో నిలదీసేందుకు సిద్ధం
ఎన్నికల హామీలపై టీడీపీ నేతలను నిలదీసేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి తదితర పథకాలపై అధికార పార్టీ నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళ్లేందుకు సైతం టీడీపీ నేతలు భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మాదకద్రవ్య రహిత జిల్లానే లక్ష్యం
అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చేయడం.. ఆనక ముఖం చాటేయడం టీడీపీకి అలవాటే.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్లు, సూపర్ సెవన్లు అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై నీళ్లు నములుతున్నారు. ఇచ్చే ఒకటో, అరో పథకాలు సైతం సక్రమంగా ఇవ్వకుండా.. తూతూమంత్రంగా అమలు చేస్తూ.. చేతులు దులుపుకొంటున్న సర్కారు ముఖ్యమైన హామీల అమలుపై మాత్రం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం విషయంలో మొండిచేయి చూపించడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం రాబోయే స్థానిక ఎన్నికల్లో తీవ్రంగా ఉండనుందని కూటమి నేతలే భయపడుతుండడం విశేషం.
ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న చర్చ జనాల్లో కొనసాగుతోంది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా వంటి అనేక ముఖ్య పథకాలు ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ఖచ్ఛితంగా ముందుకు సాగింది. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు మరిచిపోతే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రజలను ఏ మార్చే విధంగా మిగిలిన రెండున్నరేళ్ల పాలన ముగించి మమ అనిపించినా ప్రజలు నమ్మే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. 2014లో ఎన్నికల్లో సైతం టీడీపీ అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు తూతూమంత్రంగా నిరుద్యోగ భృతి, పసుపు–కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేలు బ్యాంకు ఖాతాల్లో వేయడం, రైతులకు సొమ్ములు జమ చేయడం వంటివి చేసినా జనం నమ్మలేదు. 2019లో ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడించిన పరిస్థితి నెలకొంది. ఈసారి సైతం అదే సీన్ రిపీట్ కానుందని జనం చర్చించుకుంటున్నారు.


