చిలకలూరిపేటటౌన్: ఈత కొడదామని వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో స్థానిక సుభాని నగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగులో మునిగి ఐదో తరగతి విద్యార్థి చందు (11) మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తమ ఇంటి సమీపంలోని వాగు వద్దకు వెళ్లాడు. నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో, లోపలికి వెళ్లిన చందు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత నీటిలో మునిగి ఉన్న చందుని బయటకు తీయించారు. అయితే అప్పటికే శ్వాస ఆగిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఈత సరదా ఇలా ప్రాణాలు తీయడం స్థానికులను సైతం కలచివేసింది. ఈ సందర్భంగా ఎస్ఐ హజరత్తయ్య మాట్లాడుతూ సెలవుల సమయంలో పిల్లలు చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


