నరసరావుపేట రూరల్: స్కూటీలో దాచిన రూ.5లక్షలు చోరీకి గురైన ఘటన మండలంలోని జొన్నలగడ్డ సమీపంలోని ఉల్లిపాయల దుకాణం వద్ద చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన అన్నా వెంకట సత్యనారాయణ మంగళవారం నరసరావుపేటలోని బందువుల నిర్వహించే బంగారు దుకాణం వద్దకు స్కూటీపై వచ్చాడు. అక్కడ వారి నుంచి నగదు తీసుకుని స్కూటీపై తిరుగు ప్రయాణ మయ్యాడు. ఇంటికి అవసరమైన ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు గుంటూరు రోడ్డులో జొన్నలగడ్డ సమీపంలోని హోల్సేల్ ఉల్లిపాయల దుకాణం వద్ద స్కూటీని నిలిపాడు. దుకాణంలోకి వెళ్లి ఉల్లిపాయలు తీసుకుని తిరిగి వచ్చే లోగా స్కూటీలో దాచిన రూ.5లక్షలు నగదు మాయమయింది. ఈ విషయాన్ని దుకాణం నిర్వాహకులకు తెలియజేయడంతో వారు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఇందులో ఒక యువకుడు స్కూటీలో దాచిన నగదును తీసుకుని వెళ్లడం స్పష్టంగా కనిపించింది. సత్యనారాయణ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ కిషోర్ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
జొన్నలగడ్డ సమీపంలో
ఉల్లిపాయల దుకాణం వద్ద ఘటన


