
రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం
కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కూరపాటి కృష్ణ
శావల్యాపురం: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులుగా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కూరపాటి కృష్ణ మండిపడ్డారు. మండలంలోని గంటావారిపాలెంలో ఈనెల 19న ఎస్టీ వర్గీయుడైన కుంభా యోగయ్య దుకాణాలను పొక్లయిన్, జేసీబీతో కూల్చివేసి, కులం పేరుతో దూషించిన ఆగ్రవర్ణాలకు చెందిన కొనకంచి వెంకట్రావు, మురళి, మాదినేని మధుసూదనరావు, గోపు రామకృష్ణ, రావి హరి వెంకట నరసింహారావులపై ఎస్సీ,ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట దళిత, గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూరపాటి కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గీయులపై దాడులు జరిగిన వెంటనే గ్రామాన్ని సందర్శించి వారికి మనోఽఽఽధైర్యాన్ని నింపాల్సిన కలెక్టరు, ఎస్పీలు 10 రోజుల గడుస్తున్నా ఇప్పుటి వరకు రాకపోవడం చట్టాలను అపహస్యం చేయటమేనని తెలిపారు. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, బాధితులను భయపెడుతున్న ఎస్ఐ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తహసీల్దారు యం.అర్జున్నాయక్కు వినతిత్రం అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, ఓర్సు శ్రీనివాసరావు, జక్కా బ్రహ్మయ్య, చలంచర్ల అంజి, ఖాశీం, కుంభాల పోతురాజు, ఏడుకొండలు, సీపీఐ నాయకులు జె.కృష్ణానాయక్, వివిధ సంఘాల నేతలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.