చిలకలూరిపేట టౌన్: భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నక్షత్ర వనాన్ని ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. నక్షత్ర వనం వంటి ఆధ్యాత్మిక, పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. పచ్చని చెట్లతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. తన స్వగ్రామమైన బొప్పూడిపై ఉన్న మమకారంతోపాటు, పర్యావరణం పట్ల గ్రామస్థులు చూపుతున్న శ్రద్ధను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ కోర్టు సివిల్ జడ్జి కె. నరేంద్రరెడ్డి, గ్రామ పెద్దలు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్


