● 24న నిరాహార దీక్షకు నిర్ణయం
● జయప్రదం చేయాలని
పల్నాడు జిల్లా కమిటీ పిలుపు
నరసరావుపేట: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం రణభేరి–3 పేరిట ఈ నెల 24వ తేదీన పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించే ఒక్క రోజు నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుకూరి మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కార్యాలయంలో రణభేరి–3 కరపత్రాలను నాయకులతో కలసి ఆవిష్కరించారు. తొలుత యూటీఎఫ్ పూర్వ నాయకులు అప్పారి వెంకటస్వామి 26 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం, విద్యా వ్యవస్థ ప్రగతి కోసం 12 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిన నాయకులు అప్పారి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బలమైన ఉపాధ్యాయ ఉద్యమాలను నిర్మించాలని నేతలు పిలుపునిచ్చారు. మోహనరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో నెంబర్ 57 వర్తింపు, సీపీఎస్ రద్దు తదితర ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళలనలకు ఇచ్చిన పిలుపు మేరకు 24న జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఒక్క రోజు చేసే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.సుందరరావు, టి.వెంకటేశ్వర్లు, ఆయా ప్రాంతీయ శాఖల బాధ్యులు డి.కోటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, ఎల్.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.


