రాయగడ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర మినరల్ బేరింగ్ ఏరియాస్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఓవర్సైట్ అథారిటీ జస్టిస్ ఏకే పట్నాయక్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆరోగ్య, విద్యారంగాల మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రాజెక్టుల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి సందర్శించిన ఆయన వివిధ విభాగాలను పరిశీలించారు. ఎక్స్రే యూనిట్, డయాలసిస్ యూనిట్, శిశు వైద్య విభాగం, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో చర్చించారు. హాస్పిటల్లో రోగులకు మరిత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఓఎంబీఏడీసీ నిధుల ద్వారా అవసరమైన పరికరాలు, సౌకర్యాలను సమకూర్చే అంశంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం కొలనార సమితి పరిధి చందిలి పోలీస్స్టేషన్ పరిధిలోని పార్వతీనగర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ను సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలకు అందుతున్న సౌకర్యాలు, విద్యా వ్యవస్థను పరిశీలించారు. ఆయనతో పాటు కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, సీడీఎంవో డాక్టర్ విశ్వంబర్ బెహర, డీపీవో లక్ష్మీధర్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.


