రాయగడ: జిల్లాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన మునిగుడ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడం, వీధి దీపాలు పనిచేయకపోవడంపై వ్యాపారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీడీవోకు ఐదు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. పట్టణం మీదుగా వెళ్లే ప్రధాన రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉన్న డ్రైన్లు, చెత్త, మట్టి వ్యర్థాలతో పూర్తిగా పూడుకుపోయాయని వ్యాపారులు వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోతుందని, దీంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గతంలో డెంగీ, స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో ప్రస్తుత పారిశుద్ధ్య పరిస్థితులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వివరించారు. అదేవిధంగా వెలగని విద్యుత్ దీపాలు వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు.


