జయపురం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, మండీలకు తీసుకువచ్చిన ధాన్యం కొనుగోలుపై దృష్టి కేంద్రీకరించాలని కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. లేంప్స్ల ప్రధాన లక్ష్యం.. వ్యవసాయం ఉన్నతి, రైతుల ఆర్థిక ప్రగతే కావాలన్నారు. మంగళవారం జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి బొతాసన గ్రామంలో నిర్వహించిన కొట్పాడ్ లేంప్స్ స్వతంత్ర వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొట్పాడ్ లేంప్స్ పరిచాలన డైరెక్టర్ రాజేంఽద్ర నాయక్ అధ్యక్షత వహించారు. కొరాపుట్లో 2025–26 రబీ సీజన్ ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను డైరెక్టర్ రాజేంద్ర నాయక్ వివరించారు. సమావేశంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో లేంప్స్కు రూ.52,07,872 లాభం వచ్చిందని, లాభాన్ని కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్లో రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నా. ఏ రైతులైతే రుణాలు తీసుకున్నారో కేసీసీ బ్యాంక్లో వేసిన లాభంతో రుణం తీరుతుందన్నారు. రైతు నేత ప్రఫుల్ల కుమార్ బిశాయి రైతుల సమస్యలపై మాట్లాడుతూ.. సునారిబలి నువాగాంలో గల లేంప్స్ శిథిలావస్థలో ఉందని, దీనిని పునర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రతినిధి రామేశ్వర జేనా, డీఎల్పీసీ సభ్యుడు గణేష్ చంద్ర పండా, ఘుమర సర్పంచ్ కమల పూజారి, కొట్పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర మఝి, తదితరులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
జయపురం: ఆదివాసీ కోంద్ సంప్రదాయ యువతిని వివాహం చేసుకుంటానని ప్రలోబపరుచుకుని, ఆ తరువాత మోసం చేసిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆదివాసీ యువతికి న్యాయం చేయాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్శాఖ నేతలు డిమాండ్ చేశారు. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ను కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, తదితరులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో కోంద్ ఆదివాసీ యువతిని కందులిగుడ గ్రామానికి చెందిన యువకుడు వివాహం చేసుకుంటానని ప్రలోబపరచి, ఆమెతో శారీరిక సంబంధం నెలకొల్పాడని, ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన విషయాన్ని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై బొయిపరిగుడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.
ఏసీఏలో హనుమాన్ జయంతి
భువనేశ్వర్: హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఏసీఏ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించింది. కార్యవర్గ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సమితి సభ్యులు భక్తి శ్రద్ధలతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఏసీఏ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది.


