పర్లాకిమిడి: గజపతి స్టేడియంలో సీఎం ఫుట్బాల్ ట్రోఫీ చాంపియన్షిప్ పోటీలను అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గుణి మఝి సాయంత్రం ప్రారంభించారు. ఈ అంతర్జిల్లా చాంపియన్ షిప్ పోటీలకు 14 ఏళ్ల లోపు బాలుర జట్లు 6, బాలికలు 5 జట్లు పాల్గొన్నాయి. పర్లాకిమిడి, గుసాని బ్లాక్లో ఉప్పలాడ ఠాగోర్ మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆర్.ఉదయగిరి, నువాగడ, బాగుసల (గుసాని), కాశీనగర్ జట్లు తొలిరోజు పాల్గొన్నారు. తొలుత చంద్రగిరి, గుసాని సమితి బాగుసల పాఠశాల విద్యార్థులు తలపడ్డారు. వీరిలో చంద్రగిరి ఉన్నత పాఠశాల విద్యార్థులు పైచేయి సాధించారు. ఈ సందర్భంగా ఏడీఎం మఝి మాట్లాడుతూ, అండర్ 14 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం సీఎం ట్రోఫీను అందజేస్తుందని, అందుకోసం ఈనెల 14 వరకూ స్టేడియంలో ఫుట్బాల్ పోటీలు జరుపుతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడాధికారి త్రినాథ సాహు, ఉన్నత పాఠశాలల క్రీడాధికారి సురేంద్ర పాత్రో, ఎస్ఎస్డీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాధికారి సంతోష్ప్రసాద్ పండా, ఉప్పలాడ ప్రభుత్వ ఠాగోర్ ఉన్నత పాఠశాల పీఈటీ రేఖారాణి దేవ్ తదతరులు పాల్గొన్నారు.


