జయపురం: రాష్ట్ర ఆర్థిక, న్యాయ శాఖల మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయవేత్త స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ 10వ వర్ధంతి సందర్బంగా జయపురం లో ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. స్థానిక రఘునాథ్ పట్నాయక్ కూడలి వద్ద ఏర్పాటు చేయబడిన నిలువెత్తు స్వర్గీయ పట్నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పెద్ద కుమారుడు కాంగ్రెస్ నాయకుడు బిరెన్ మోహణ పట్నాయక్, చిన్న కుమారుడు ప్రముఖ సంగీత కళాకారుడు ధిరెన్ మోహణ పట్నాయక్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, పుర ప్రముఖులు నివాళులు అర్పించారు. అలాగనే కొరాపుట్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు రూపక్ తురుక్ పిలుపు మేరకు స్థానిక జిల్లా కాంగ్రేస్ భవణంలో నిర్వహించిన స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రేస్ పార్టీ జిల్లా కార్యదర్శి రూపక్ తురుక్ అవిభక్త కొరాపుట్ జిల్లాకు, రాష్ట్రానికి స్వర్గీయ పట్నాయిక్ మంత్రిగా అందించిన సేవలు, వివరించారు.అవిభక్త కొరాపుట్ జిల్లాలో పలు పరిశ్రమలు న్యాయ, మహిళా కళాశాలల ఏర్పాటులో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవల స్పూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.అలాగనే స్థానిక యాదవ భవణంలో కొరాపుట్ జిల్లా ఉత్కళ సమ్మిలినీ స్వర్గీయ రఘునాథ్ పట్నాయిక్ వర్దంతి సభను నిర్వహించి నివాళులు అర్పించారు.
ఘనంగా నర్సింగ్ దినోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో సత్యనారాయణ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్లో మంగళవారం 52వ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షురాలు హాజరై నర్సింగ్ విద్య స్థాపకురాలు ఫోరెసీ నిగితిన్గేలా సేవాభావం క్రమశిక్షణ, అంకితభావాన్ని విద్యార్థులకు వివరించారు. ఆమె త్యాగం నిస్వార్ధ సేవా భావం ద్వారా ప్రేరణ పొందుతూ దేశానికి, సత్యనారాయణ్ నర్సింగ్ సంస్థకు పేరు.. గౌరవం తీసకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షురాలు సుశ్రీ సుమరిన్ సుమన్ కార్తిక్, తనుశ్రీ దేవనాధ్, సిబ్బంది పాల్గున్నారు .
ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు
రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ కిల్లి వెంకటరావు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పరిశీలించి వివరాలు సేకరించారు.
లారీ ఢీకొని రిటైర్డ్ ఎంఈఓ మృతి
ఎచ్చెర్ల: అల్లినగరం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో ఆకుల సన్యాసినాయుడు (80) మృతి చెందారు. ఈయన విశాఖపట్నం నుంచి స్వగ్రామం వచ్చేందుకు అల్లినగరం జంక్షన్ వద్ద బస్సు దిగి జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సన్యాసినాయుడుకు భార్య సీతారత్నం, కుమారుడు నాయుడుబాబు, కుమార్తె ఉమ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


