రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల మరాఠీగుడ కపిలపూర్ సమీపంలో మున్సిపాలిటీ స్థలాలను అక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్న వారికి సంబంధిత శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన 48 గంటల గడువులో స్థలాలను ఖాళీ చేయాలని, లేనిపక్షంలో ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇలా 35 కుటుంబాలు మున్సిపాలిటీ స్థలాలను అక్రమించుకున్నట్లు గుర్తించిన మున్సిపాలిటీ అధికారులు ఈ మేరకు వారికి శనివారం నోటీసులు జారీ చేశారు. ఇంటింటికీ సంబంధిత శాఖ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 42 మంది స్థలాలను ఆక్రమించుకున్నట్లు తమ సర్వేలో తేలిందని మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంగతోష్ కుమార్ నాయక్ తెలిపారు. మొదటి విడతలో 35 మంది కుటుంబాలకు ఈ నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం మిగతా వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


