రాయగడ: జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో గల రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యానాణ్యత, హాస్టల్ నిర్వహణకు మెరుగు పరిచేందుకు కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం కలెక్టర్ సమావేశ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలో గల 149 రెసిడెన్సియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. విద్య శ్రేష్టత, విద్యార్థుల సంక్షేమంపై దృష్టిసారించి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించినంత స్థాయిలో విద్యా నాణ్యత మెరుగుపడటం లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అందుకు కారణం ఉపాధ్యాయుల కొరతేనని, దీని వల్ల విద్యావిధానికి గండి పడుతుందని ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యా బోధన గురించి నియమితులైన ఉపాధ్యాయులకు బోధనతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించడంతో వారు ఆశించినంతగా విద్యార్థులకు బోధించలేకపోతున్నారని వివరించారు. దీని వల్ల విద్యా నాణ్యత పూర్తిగా లోపించిందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలలొ పదో తరగతి పరీక్షల్లో కనీసం ఐదుగురు విద్యార్థులు ఎ–1 గ్రేడ్ను సాధించి ఉత్తీర్ణులయ్యేలా కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు.


