పర్లాకిమిడి: మహేంద్రగిరి పరశురాం క్షేత్ర పర్వతంపై జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు మహేంద్రమేళాను నిర్వహిస్తున్నట్టు మహంత డాక్టర్ హరిహర దాస్ ఆదివారం తెలిపారు. ఈ మహేంద్రమేళాకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా ప్రారంభిస్తారని మాజీ ఎస్డీసీ చైర్మన్, బీజేపీ నాయకులు అంతర్యామి గోమాంగో అన్నారు. స్థానిక రాజవీధిలో శ్రీశైలం కల్యాణ మండపంలో విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు సిద్ధేశ్వర మిశ్రా, మహంత రామానంద దాస్, కాశీనగర్ బీజేపీ నాయకురాలు నళినీ పాత్రో పాల్గొన్నారు. మహేంద్రగిరి కుల పర్వతం ప్రాచుర్యం సంపాదించడానికి వివిధ హోమాలు, యజ్ఞాలు, పుష్కర స్నానాలు జరుపుతామన్నారు. తొలిరోజు కలశ యాత్ర, దీక్షాగ్రహణ, అంకురార్పణం, భాగవతం, రామచరిత మానస పఠిస్తామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే పలు ఆథ్మాత్మిక కార్యక్రమాల్లో అనేకమంది సాధు సంతవులు ఇక్కడికి విచ్చేస్తారని సిద్ధేశ్వర మిశ్రా తెలియజేశారు.


