శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన నల్లాన వెంకునాయుడు నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని సంఘ జాతీయ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ నియామక పత్రాన్ని వెంకునాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకునాయుడు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి పిల్లా కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో
చోరీలకు అడ్డుకట్ట
పలాస: దొంగతనాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కోరారు. ఆదివారం స్థానిక జి.ఎం.ఈ కాలనీలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఇటీవల దొంగతనం జరిగిందని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోతున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతివీధిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


