పర్లాకిమిడి: స్థానిక కవిచంద్ర వీధిలో కార్యాలయంలో అనేక మంది కవులు బంధుమిలన్ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ బృందావన్ సువార్ జీవిత చరిత్ర, ఆయన కవితలు, పుస్తకాలుగా ప్రచురించాలని అధ్యక్షులు ప్రసాద్ సువార్, నిర్ణయించారు. ఈ బంధుమిలన్ కార్యక్రమంలో బినోదిని కళాశాల అధ్యక్షులు మనోజ్ పట్నాయిక్, ప్రగతి మహిళా సంఘటన కార్యదర్శి తనూజా శతపతి, బిజయకుమార్ పండా, సురేష్ కుమార్ పండా, తదితరులు పాల్గొన్నారు.
మెట్రిక్యులేషన్లో గజపతి రికార్డు
పర్లాకిమిడి: మెట్రిక్యులేషన్ పరీక్ష ఫలితాల్లో గజపతి జిల్లా విద్యార్థులు 99.31 శాతం ఉత్తీర్ణత సాధించి మరోసారి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా ముఖ్య శిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, బ్లాక్ శిక్షాధికారులు, ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో కేకును కోసి వేడుక జరుపుకున్నారు. గజపతి జిల్లాలో గోతఖెల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆద్యషరాణీ ప్రధాన్ టెన్త్లో 600 మార్కులకు 559 మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచింది. గుసాని సమితిబుసుకిడి ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థిని జి.చేతన 550/600 సాధించగా, మార్తీ గోమాంగో (నువాగడ), ఛెలిగడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్ష్మీరాణి పాణి, రండివ ఉన్నత పాఠశాల విద్యార్థి రుద్ర ప్రసాద్ పోరిచ్చా, ఆర్.ఉదయగిరి బ్లాక్కు చెందిన లుధియారాణీ రయితో 540 మార్కులు సాధించారు. జిల్లాలో ఏ1 గ్రేడ్ ర్యాంకులు ఆరుగురు విద్యార్థులు సాధించారు. మొత్తం గజపతి జిల్లాలో 3,939 బాలురు, 3988 మంది బాలికలు పాసయ్యారు.
దగ్గుమందు అక్రమ రవాణా
రాయగడ: ఝార్సుగుడ జిల్లా పరిధిలోని రెంగాలి పోలీస్ స్టేషన్ సమీర్బాగ్ సమీపాన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేటు లేని ఒక కారును గుర్తించి దానిని ఆపేప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో కారును ఆపకుండా చవదకుడు అతివేగంగా వెళ్లిపోవడంతో అనుమానించిన పోలీసులు వెంటనే కారును వెంబడించి పట్టుకున్నారు. కారుని తనిఖీ చేయగా అందులో 480 సీసాల దగ్గు మందు పట్టుబడింది. దీనికి సంబంధించి కారు డ్రైవరు మహమ్మద్ ఆలాప్ అన్సారి అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఝార్సుగుడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర తెలిపారు. ఎస్ఐ చిత్రసేన్ డెహురి నేతృత్వంలొ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారన్నారు. రాంచి నుంచి దగ్గు మందు సీసాలను కొనుగొలు చేసి ఛత్తీస్ఘఢ్కు అక్రమంగా తరలిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు.
అలరించిన సప్తగిరి సంకీర్తనలు
భువనేశ్వర్: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 618వ జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి సప్తగిరి సంకీర్తన ఆలాపన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన గాయకులతో సమితి సభ్యులు సంకీర్తనాలాపనలో ఉత్సాహంతో పాలుపంచుకున్నారు. వినోద్ (ఇచ్ఛాపురం) మృదంగం, దుంపల ఈశ్వర రావు (శ్రీకాకుళం) వయోలిన్ వాద్య సహకారం అందజేశారు. సమితి కార్యవర్గ సభ్యుల సమన్వయంతో కొనసాగిన కార్యక్రమం శ్రోతలను అలరించిందని అధ్యక్షుడు గన్నవరపు ఆనంద రావు తెలిపారు.


