జయపురం: జయపురం సడితి కుములిపుట్ గ్రామ పంచాయతీ కుములిపుట్లో రఘునాధ్ గౌఢ(60) హత్య కేసులో జయపురం సదర్ పోలీసులు ఆదివారం ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి కుమారి అర్చిత మిత్తల్ పత్రికల వారికి తెలిపారు. అరెస్టు అయిన వ్యక్తి కుమిలిపుట్ టున పొరజ(25)అని ఆమె వెల్లడించారు. వృద్ధుని హత్య సందర్భంగా జయపురం సదర్ పోలీసు అధికారులు సదర్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ నెల 27వ తేదీ సాయంత్రం రఘునాథ్ గౌఢ పంపుణి గ్రమంలో ఒక టీ దుకాణంలో టీ తాగేందుకు వెళ్లాడు. అయితే టీ తాగేందుకు వెళ్లిన రఘునాథ్ తిరిగి ఇంటికి రాలేదు. టీ తాగేందుకు వెళ్లిన తండ్రి రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో అతడి కుమారుడు భగవాన్ గౌడ అన్ని చోట్లా వెతికాడు. అనంతరం కుములి గ్రామం సమీపంలో ఒక కాలువలో రఘునాథ్ గౌడ మృతదేహం చూసిన వారు ఆ విషయం భగవాన్ గౌడకు తెలియజేశారు. అతడు వెళ్లి చూడగా తన తండ్రి మృతదేహం కనిపించింది. శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆయన జయపురం సదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన సదర్ పోలీసులు వెంటనే ససంఘటనా ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించి సైంటిఫిక్ టీమ్కు సమాచారం అందించి రప్పించారు. పోలీసులు సైంటిఫిక్ టీమ్ సహకారంలో దర్యాప్తు ప్రారంభించారని ఎస్డీపీఓ అర్చిత మిత్తల్ వెల్లడించారు. మృతుని కుమారుడు భగవాన్ గౌఢ లిఖిత ఫిర్యాదుపై సదర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు పోలీసులు కుమిలిపుట్ గ్రామం టును పొరజను అరెస్టు చేసారని తెలిపారు. తమదైన శైలిలో టున పొరజను విచారించగా పూర్వ వైరం వల్ల రఘునాథ్ను హత్య చేసినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ముందు రఘునాథ్పై రాయితో కొట్టి కాలువలో పడవేసి అనంతరం ఒక కత్తితో అతడి గొంతు కోసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిపారు. అతడిపై హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాదు ప్రారంభించినట్లు ఎస్డీపీఓ వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో సదర్ పోలీసు స్టేషన్ అధికారి సచింద్ర ప్రధాన్, పోలీసు అధికారి కేబీ రామదాస్, కేసు దర్యాప్తు అధికారి ఎస్ఐ ప్రమోద్ పాణి పాల్గొన్నారు.


