● వివాహిత ఆత్మహత్య ● భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జి.సిగడాం: మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన కిమిడి రాజేశ్వరి(27) భర్త వేధింపులు తట్టుకోలేక ఆదివారం 3 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆనందపురం గ్రామానికి చెందిన కొంచాడ సూర్యారావు, యశోదల కుమార్తె రాజేశ్వరిని విశాఖపట్నంలో పోలీస్ బ్యారక్స్ ఎంటీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న కిమిడి శ్యామలరావుకు ఇచ్చి 2019లో వివాహం చేశారు. శ్యామలరావు మద్యం, పేకాట, బెట్టింగ్ ఇతర వ్యసనాలకు బానిసై రాజేశ్వరి దగ్గర ఉన్న బంగారం తీసుకుని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపా రు. భర్త వేధింపులు తట్టుకోలేక రాజేశ్వరి గతనెల 26న వైజాగ్ నుంచి కన్నవారింటికి వచ్చింది. కానీ భర్త తీరుకు విసిగిపోయిన ఆమె ఈ నెల 2న భర్తకు ఫోన్ చేసి ‘నువ్వు వ్యసనాలు మానకపోతే చనిపో తాను’ అని చెప్పింది. శ్యామలరావు ‘చనిపోతే చనిపో..’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఆమె తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కుంది. ఈ దంపతులకు 18 నెలల బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కోరుకొండ రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. జేఆర్ పురం సీఐ అవతారం దర్యాప్తు చేస్తున్నారు.
భర్త, అత్తే కారణమంటూ..
తన కుమార్తె రాజేశ్వరి మృతికి తన భర్త, అత్తమామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు యశోద, సూర్యారావు ఆరోపించారు. భర్త తీరుకు విసిగిపోయే ఆమె ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ కేఏ సూరి, ఏఎస్ఐ రామకృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజేశ్వరి భర్త శ్యామలరావు,అత్త మామలు, చిన్నమ్మడు, తవిటినాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.


