
ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి
● డైట్ విద్యార్థుల నిరసన
జయపురం: స్థానిక జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం(డైట్)లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థినిని ఒక అధ్యాపకురాలు మానసికంగా వేధిస్తోందని డైట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డైట్ ప్రధాన గేట్ ముందు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి నిరసన తెలుపుతూ అధ్యాపకురాలిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డైట్ ప్రిన్సిపాల్ రూపచంద్ర సొరెన్ విద్యార్థుల వద్దకు వచ్చి చర్చించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. అధ్యాపకురాలు స్వాతి 7 నెలలుగా అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. డైట్ అధికారులు ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయగా, ఆమె అన్ అఫీషియల్గా మరో గ్రూప్ రూపొందించారని వెల్లడించారు. ఆ గ్రూపులో అర్థరాత్రి వివిధ రకాల మెసేజ్లు చేస్తున్నారని, వ్యక్తిగతంగా ఆక్షేపిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు లేకపోతే ఎందుకు చదువుతున్నారని ఒక విద్యార్థినిని అందరి ఎదుట అవమానించారని పేర్కొన్నారు. దీంతో సదరు విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించిందని వాపోయారు. ఈ విషయంపై శనివారం ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అయితే సోమవారం చర్చిద్దామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారని, చర్చలకు అందరూ వచ్చినా అధ్యాపకురాలు స్వాతి రాకపోవడంతో సాయంత్రం 6 గంటల వరకు చూసి ఆందోళనకు దిగామని పేర్కొన్నారు.