
సాయి బేతి మృతదేహం
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు పరిధి లూగాల్ పంచాయతీలో నివాసముంటున్న బేతి కన్న అనే వ్యక్తి భార్య సాయి బేతి (22) గురువారం ఉదయం గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయి బేతి కాలి నొప్పులతో బాధపడుతోంది. దీంతో రెండు రోజులుగా పొలం పనులకు ఆమె వెళ్లకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గురువారం వరికోత కోసం కన్న తన తల్లితో కలిసి పొలానికి వెళ్తూ, భార్యను సైతం వరికోతకు రమ్మని చెప్పాడు. దీంతో ఇంటి వద్దనే ఆమె గన్నేరు పప్పు తిని పొలానికి వెళ్లింది. అనంతరం కొద్దిసేపటికే నోటివెంట నురగలు వచ్చి పడిపోయింది. అది చూసిన అత్త, భర్తలు సమీపంలో ఉన్నవారి సాయంతో ఎంవీ 79 ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలియడంతో మోటు పోలీసులు ఆరోగ్య కేంద్రానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కలిమెల ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహరాజ్పల్లి పంచాయతీ బలిగూడ గ్రామానికి చెందిన సాయికి కన్నతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.