
బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలకు బ్యూటీషియన్, బ్యూటీషియన్ అడ్వాన్స్డ్ కోర్సుల్లో తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని, 15 నుంచి 45ఏళ్ల లోపు వారు అర్హులని తెలియజేశారు. ఆసక్తి ఉన్న వారు పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డుతో తమ కార్యాలయానికి అక్టోబర్ 3వ తేదీలోగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేస్తామని తెలియజేశారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలో నేరుగా గానీ 0866–2470420లో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.
మృతుని కుటుంబానికి
న్యాయం చేయాలని ఆందోళన
ఉయ్యూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరు ప్రధాన సెంటరులో కుటుంబ సభ్యులు, సహచరులు మంగళవారం రాస్తారోకో చేశారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయరహదారిపై గండిగుంట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొని విన్నకోట శ్రీరాములు (55) మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుని కుటుంబానికి ఆర్థికపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, కార్మికులు ఉయ్యూరు సెంటరులో ఆందోళనకు దిగారు. రూ. 15 లక్షలు పరిహారం కారు యజమాని నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో సెంటరులో ట్రాఫిక్ స్తంభించింది. సీఐ టీవీవీ రామారావు, రూరల్ ఎస్ఐ సురేష్బాబు ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపారు. చట్టప్రకారం కేసు నమోదుచేసి కారును సీజ్ చేశామన్నారు. మృతునికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనకారులపై ప్రజలకు అసౌకర్యం కలిగించింనందుకు గానూ కేసు నమోదు చేసినట్లు సమాచారం.