
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం మొదలైంది. ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలన చేసేందుకు నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవరణలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని పాలిసెట్ ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 63 మంది, లయోల కళాశాలలో 85 మంది, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో 58 మంది చొప్పున మొత్తం 206 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శనివారం పూర్తి చేశామన్నారు. పాలిసెట్లో 380వ ర్యాంకు పొందిన ఎం.సహస్ర చౌదరి సర్టిఫికెట్లను పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని ఆమెను ఎం. విజయసారథికి అందజేశారు.
నేటి షెడ్యూల్ ఇదీ..
ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రంలో 15,001 నుంచి 21 వేల ర్యాంకు వరకు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 21001 నుంచి 26500వ ర్యాంకు వరకు, లయోల కళాశాల ఆవరణలోని కేంద్రంలో 26501 నంచి 32 వేల ర్యాంకు పొందిన అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలిస్తామని కన్వీనర్ విజయసారథి తెలిపారు.
గన్నవరంలో..
గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నుంచి పాలిసెట్ అభ్యర్థులకు కౌన్సె లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పాలిసెట్ కౌన్సెలింగ్ను కోఆర్డినేటర్ వి.వి.కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం తొలిరోజు జరిగిన కౌన్సెలింగ్లో 40 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 37 మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారని కోఆర్డినేటర్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు వరకు జరిగే కౌన్సెలింగ్ను పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం