
మండుటెండలో కటిక నేలపై విద్యార్థుల యోగాసనాలు
ఇబ్రహీంపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్సిస్ రికార్డు సృష్టి స్తామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో యోగా కార్యక్రమాల నిర్వహణకు ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఇబ్రహీంపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు కటిక నేలపై కూర్చుని యోగాసనాలు వేయాల్సి వచ్చింది. ఉదయం పది గంటల సమయంలో ఎర్రటి ఎండలో ఆసనాలు వేయలేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా వేయకుండా కంకరుతో కూడిన కటిక నేలపై విద్యార్థినులతో ఆసనాలు వేయించడం గమనార్హం.
వర్గీకరణ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ నిబంధనలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటికే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో నూతన నిబంధనలు అమలు చేయాలన్నారు. నూతన నిబంధనలను అమలు చేయకుండా వర్గీకరణ చేశామని ప్రభుత్వం చెప్పుకున్నా మాదిగలకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఇకపై జరిగే నియామకాల్లో వర్గీకరణ నిబంధనలు అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎ.వి.కృష్ణ, మందా నాగమల్లేశ్వరరావు, చెట్టే సుజన రావు, వనం నాగేశ్వరరావు, విజయ్, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.
కోడూరు పంచాయతీ
కార్యదర్శి సస్పెన్షన్
చిలకలపూడి(మచిలీపట్నం): అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు పంచాయతీ ఇంచార్జి కార్యదర్శి బి. శేషగిరిరావును సస్పెండ్ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శేషగిరిరావు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, పీజీఆర్ఎస్లో గ్రామానికి చెందిన రాజనాల భాస్కరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని డీపీఓను ఆదేశించారు. దీంతో కోడూరు మండలం ఈఓపీఆర్డీ రేవతి విచారణ జరిపారు. ఈ విచారణలో రూ.34.62 లక్షల నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారించారు. ఆమె ఇచ్చిన నివేదిక మేరకు కలెక్టర్ బాలాజీ కార్యదర్శి శేషగిరిరావుపై సస్పెన్షన్ వేటు వేశారు.