
4న విద్యుత్ చార్జీలపై పోరుబాట
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జూలై నాలుగో తేదీన పోరుబాట నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. పోరుబాటలో భాగంగా ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆ రోజు నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీభవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోరుబాట వాల్ పోస్టర్ను కాశీనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సర్దుబాటు చార్జీలు, సర్చార్జీలు, వడ్డీలు ఇలా వివిధ రూపాల్లో ప్రజలపై కూటమి ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. పోరుబాటలో భాగంగా సోమవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి, సంకాల సేకరణ చేపడతామన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగులగొట్టాలని ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ పిలుపు మేరకే తాము పోరుబాట చేపట్టామన్నారు. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ, తూర్పు సిటీ కమిటీల పార్టీ కార్యదర్శులు బోయి సత్యబాబు, పి.కృష్ణ పాల్గొన్నారు.