మైలవరం చిన్నారులకు అంత్యక్రియలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మైలవరం చిన్నారులకు అంత్యక్రియలు పూర్తి

Jun 15 2025 7:14 AM | Updated on Jun 15 2025 7:14 AM

మైలవరం చిన్నారులకు అంత్యక్రియలు పూర్తి

మైలవరం చిన్నారులకు అంత్యక్రియలు పూర్తి

మైలవరం: మైలవరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిన్నారులు లక్ష్మీ హిరణ్య, లీలాసాయిల అంత్యక్రియలు శనివారం స్థానిక హిందూ శ్మశానవాటిక సమీపంలో పూర్తయ్యాయి. నాలుగు రోజుల క్రితం మైలవరంలోని మారుతీనగర్‌లో చిన్నారులు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు డీకంపోజ్‌ కావడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడం కష్టమని వైద్యులు తెలపడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మైలవరం తరలించగా, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. చివరిసారిగా చిన్నారుల తండ్రి రవిశంకర్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద చూపించడంతో పోలీసులు రవిశంకర్‌ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవిశంకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడికై నా పారిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

పెనమలూరు: టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వణుకూరు గ్రామంలో గొర్రె శ్రీనివాసరావు, అతని భార్య లక్ష్మీదుర్గ, కుమారుడు వెంకటశివఆదినారాయణ(25) నివశిస్తున్నారు. శ్రీనివాసరావు తాపీ పనులు చేస్తాడు. కుమారుడు వెంకటశివఆదినారాయణ రాపిడో బైక్‌ నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఆదినారాయణ శనివారం ఉదయం బైక్‌పై విజయవాడకు బయలుదేరాడు. అతను విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు గ్రామం వద్దకు రాగా మచిలీపట్నం నుంచి విజయవాడ వైపునకు వస్తున్న టిప్పర్‌ అతి వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆదినారాయణ బైక్‌తో సహా రోడ్డుపై పడిపోగా లారీ అతని పై నుంచి వెళ్లింది. దీంతో ఆదినారాయణ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనపై ఆదినారాయణ తండ్రి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు టిప్పర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

సైడు కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): స్థానిక సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతన్నపేట గేటు సమీపంలోని సైడు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 40–50 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎటువంటి ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మద్యం మత్తులో సైడు కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఎన్‌ పురం పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించాల్సిందిగా వారు కోరారు.

కుక్కదాడిలో పసిపాపకు తీవ్ర గాయాలు

బంటుమిల్లి: మండల పరిధిలోని నాగేశ్వరరావుపేట పంచాయతీ శివారు జానకీరామపురం గ్రామంలో శనివారం పసిపాపపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డువచ్చిన తల్లి, అమ్మమ్మలను కూడా కరిచింది. గ్రామానికి చెందిన పెద్ది వెంకటేశ్వరమ్మ కుమార్తె ఆరేపల్లి కరుణ కొద్ది నెలలుగా 9 నెలల పాపతో తల్లి వద్ద ఉంటోంది. శనివారం మధ్యాహ్నం సుమారు పాపను ఇంట్లో నిద్రపుచ్చి తల్లి బయట పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో కుక్క ఇంట్లోకి ప్రవేశించి కింద పడుకుని ఉన్న పాపను మొహం పట్టుకుని లాగే ప్రయత్నం చేయగా పాప పెద్దగా ఏడవడంతో తల్లి ఇంట్లోకి పరిగెత్తింది. తల్లి కరుణ అడ్డు రావడంతో ఆమెను కుక్క కరవడంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. అది చూసి కరుణ తల్లి వెంకటేశ్వరమ్మ అడ్డుపడగా కుక్క ఆమెను కూడా కరిచింది. వీరి కేకలు విని స్థానికులు చేరి కుక్కను వెంబడించి చంపారు. పసిపాపకు ముక్కు, మొహంపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. తల్లి కరుణ, అమ్మమ్మ వెంకటేశ్వరమ్మలకు బంటుమిల్లి పీహెచ్‌సీలో వైద్యులు పవన్‌కుమార్‌ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఏంటీ రాబిస్‌ సీరం ఇంజక్షన్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement