ప్రజలతో మమేకమవుతున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రజలతో మమేకమవుతున్నారు

Jun 16 2025 7:05 AM | Updated on Jun 16 2025 7:05 AM

ప్రజలతో మమేకమవుతున్నారు

ప్రజలతో మమేకమవుతున్నారు

కొత్తగా ‘ఫుట్‌ పెట్రోలింగ్‌’

సీపీ సాయిచైతన్య వచ్చిన తర్వాత కమిషనరేట్‌ పరిధిలోని అన్ని సర్కిళ్లలో కొత్తగా ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బృందాలు డాగ్‌స్క్వాడ్‌ ద్వారా తనిఖీలు చేపడుతున్నాయి. హోటళ్లు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రధాన కూడళ్ల వద్ద ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. అనుమానం ఉంటే స్టేషన్‌కు తరలించి ఆరా తీస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై అడ్డంగా వాహనాలు, తోపుడు బండ్లు, షాపులు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఖలీల్‌వాడి : పోలీసులు ప్రజలతో మమేకం అవుతున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కళాజాత బృందాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో వివిధ రకాల మోసాలపై ప్రజలకు నాటకాలు, పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఉన్న కార్డన్‌ సర్చ్‌ (నిర్బంధ తనిఖీలు)ని ప్రస్తుతం ‘కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం’గా మార్చారు. దీంతో అపరిచిత వ్యక్తులు సంచరించినప్పుడు పోలీసులకు తెలపడం, సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రయోజనాలు, మద్యం తాగి వాహనాలు నడపడంతో కలిగే దుష్పరిణామాలు, సైబర్‌ మోసాలు తదితర అంశాలపై వివరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.

భారీగా వాహనాలు స్వాధీనం

పోలీసులు చేపడుతున్న కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం సత్ఫలితాలిస్తోంది. పోలీస్‌ కమిషనర్‌ పోతరాజు సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీ సు బృందాలు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 25 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాయి. రిజిస్ట్రేషన్‌ పత్రాలులేని 700 లకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. నల్లబెల్లం, రేషన్‌బియ్యం నిల్వలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, దేశీదారు వంటి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుంటున్నారు.

యువతపై ప్రత్యేక దృష్టి..

పోలీసు తనిఖీలంటే ప్రజలు భయపడకుండా ఉండేందుకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం’ను నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలతో సమావేశా లు ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని వీలైనంత వరకు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులకు ఆశ్రయిం ఇవ్వొద్దని సూచిస్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారి వివరాలను సేకరించి, తగు చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా యువకులపై పోలీసులు ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. ఎలాంటి దురలవాట్లకు గురికాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్లకు పంపే లింకులు ఓపెన్‌ చేయడంతో కలిగే దుష్పరిణామాలు వివరిస్తున్నారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. గుట్కా, గంజాయి, మద్యం తదితర వాటికి యువత దూరంగా ఉండాలని, లేకుంటే కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని చెప్తున్నారు. ఘర్షణలు, హత్యలు, ఇతర నేరాలకు పాల్పడితే ఏర్పడే ఇబ్బందులను కూలంకషంగా వివరిస్తున్నారు.

సత్ఫలితాలిస్తోన్న

‘కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం’

పట్టణ, గ్రామాల్లో విస్తృత తనిఖీలు

పాత నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా

ఫుట్‌ పెట్రోలింగ్‌తో నిఘా

నమ్మకం కలిగిస్తున్నాం

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం. గతంలో గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా ఎవరైనా వస్తే సులభంగా తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం ద్వారా తనిఖీలు చేపడుతున్నాం. పాత నేరస్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు, రేషన్‌ బియ్యం, ఇసుక అక్రమ రవాణా తదితర అక్రమ దందాలపై సమాచారం సేకరిస్తున్నాం. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తాం.

– విజయ్‌బాబు, సీఐ, బోధన్‌ రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement