
ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలి
నిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ డీఏ, బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లుస్వరాజ్యం ట్రస్టు కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటును పూర్తిగా నిలిపివేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 317 జీవో బాధితులను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. అన్ని కేటగిరిల పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయాలని, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం జాప్యం చేస్తే టీఎస్యూటీఎఫ్ పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షులు, మల్లేష్, ట్రెజరర్ రాజారామ్, జిల్లా కార్యదర్శులు జనార్దన్, సాయన్న, బాబులు, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రఘు, రాజేశ్వర్, ప్రభాకర్, లింగం, బాలరాజు, లింబగిరి స్వామి, రవీందర్, భూమేశ్వర్, బాజన్న, సుధాకర్ శ్యామ్ రావ్, తదితరులు పాల్గొన్నారు.