
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బాద్గుణ గ్రామానికి చెందిన అల్లూరి లింగారెడ్డి (57) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి లింగారెడ్డి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో ఉన్న తన చెల్లి వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. కానీ, చెల్లెలి ఇంటికి వెళ్లకుండా మార్గమధ్యలో ఉమ్మెడ శివారులోని బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అల్లుడు తాటిపల్లి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
మనస్తాపంతో ఒకరు..
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని మంచిప్ప తండాకు చెందిన గోవర్ధన్(38) మంచిప్ప పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోవర్ధన్కు అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతాయి. మద్యానికి బానిసయ్యాడని శనివారం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గోవర్ధన్ మంచిప్ప పెద్ద చెరువులో దూకడాన్ని మృతుడి కుమారుడు శ్రీనివాస్ చూసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.